అదిగో వచ్చేసింది... ఇదిగో వచ్చేసింది అంటూ ఊరించిన 'ఉదయ్' ఎక్స్ప్రెస్ నేటికీ ప్రారంభం కాకపోవడంతో ప్రయాణికులు నిరాశతో నిట్టూరుస్తున్నారు. విశాఖపట్నం, విజయవాడ మధ్య నడిపేందుకు సిద్ధం చేసిన ఈ డబుల్ డెక్కర్ రైలును వాల్తేరు డివిజన్కు కేటాయించడానికి తూర్పు కోస్తా రైల్వేపై ఎన్నో ఒత్తిళ్లను తేవాల్సి వచ్చింది. ఆధునాతనమైన ఎల్హెచ్బీ కోచ్లతో కూడిన ఈ డబుల్ డెక్కర్ రైలు గత నెల 26న పట్టాలెక్కుతుందని విస్తృత ప్రచారం జరిగింది.
అయితే ఆఖరి నిమిషంలో వాయిదా పడింది. దీంతో అధికారులతో పాటు ప్రయాణికులూ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. కొత్త రైలును కేటాయించినా సిబ్బందిని ఇవ్వలేదని, నిర్వహణకు ఇది ప్రధాన అడ్డంకిగా మారిందని... అందుకనే ప్రారంభోత్సవం వాయిదా పడిందని అధికారులు చెపుతూ వచ్చారు. అయితే అసలు కారణం అది కాదని విశ్వసనీయ వర్గాల సమాచారం.
'ఉదయ్' ఆలస్యానికి కారణమిదే...
జూలై...
more... 15న విశాఖకు వచ్చిన ఉదయ్ ఎక్స్ప్రెస్ రైలును మర్రిపాలెం యార్డుకు తరలించారు. కోచ్లకు తాళాలు తగిలించారు. రైలును ప్రారంభించడానికి ముందు సహజంగా నిర్వహించే ట్రయల్ రన్ను ఆగస్టు నెలలో విజయనగరం జిల్లా కోరుకొండ వరకూ నిర్వహించారు. ఈ ట్రయల్ రన్లో ఓ సాంకేతిక లోపం బయటపడిందని తెలుస్తోంది. ఆ సాంకేతిక లోపమే ఉదయ్ ప్రారంభోత్సవానికి అడ్డంకిగా మారిందని సమాచారం.
ఎల్హెచ్బీ కోచ్లు భిన్నం...
సాధారణ రైళ్లకు భిన్నంగా ఎల్హెచ్బీ కోచ్ల నిర్వహణ ఉంటుంది. విశాఖ నుంచి ఢిల్లీ ప్రతిరోజు నడిచే ఏపీ ఎక్స్ప్రెస్లో ఉన్నవన్నీ ఇవే కోచ్లు. ఎల్హెచ్బీ కోచ్ల నిర్వహణ చూసే నిపుణులైన సిబ్బంది వాల్తేర్ డివిజన్లో అందుబాటులో లేరు. దీనితో ఏపీ ఎక్స్ప్రెస్ అనేక విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ వేసవి ఆరంభం నుంచే ఏసీ పనిచేయడం లేదన్న ఫిర్యాదులు తరుచూ వస్తున్నాయి. ఈ ఎక్స్ప్రెస్లో రైలు పెట్టెలకు విద్యుత్ సరఫరా 'పవర్ కార్'ల ద్వారా వస్తుంది. ఏపీ ఎక్స్ప్రెస్ అనుభవంతో అందుకు భిన్నమైన పద్ధతిని ఉదయ్ ఎక్స్ప్రెస్లో ఎంచుకొన్నారు. దీనిలో ఇంజన్ నుంచే పవర్ని తీసుకుంటారు. దీనివల్ల సమస్యలు ఉత్పన్నం కావని రైల్వే అధికారులు ట్రయల్ రన్కు ముందు భావించారు. తీరా ట్రయల్ రన్ వేశాక పవర్లో లోపాలు ఎదురవుతున్నట్టు గుర్తించారు. ఈ దశలో రైలు ప్రారంభించి అవస్థలు పడడానికి అధికారులు సిద్ధంగా లేరు. ఆ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించిన తరువాతే అందుబాటులోకి తేవాలని వారు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రారంభ కార్యక్రమం వాయిదా పడినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో ఈ రైలు ఎప్పుడు పట్టాలెక్కుతుందన్న విషయాన్ని అధికారులు కూడా స్పష్టంగా చెప్పలేకపోతున్నారు.