Work Started on Kotipalli and Narsapur Railway line
గౌతమి నదిపై దక్షిణమధ్య రైల్వే పరిధిలో పొడవైన వంతెన
కోనసీమ వాసుల ఏళ్ల నాటి కల నెరవేరుతోంది. కోనసీమ రైల్వేలైను నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. మొదటి దశలో గౌతమీ నదీపాయపై కోటిపల్లి-శానపల్లిలంక మధ్య వంతెన నిర్మాణం మొదలు పెట్టారు. గౌతమీనదికి కుడివైపున అయినవిల్లి మండలం శానపల్లిలంక సమీపంలో పనులు జరుగుతున్నాయి. ఈ రైల్వేలైను నిర్మాణంలో గౌతమి, వైనతేయ, వశిష్ఠ నదీపాయలపై రైలు వంతెనల నిర్మాణమే అత్యంత కీలకం. సుమారు రూ.2 వేల కోట్లు వ్యయమయ్యే ఈ ప్రాజెక్టులో వంతెనల నిర్మాణాలకే సుమారు రూ. 1200 కోట్లకు పైగా అవసరం.
మొదటి...
more... దశలో ...
కాకినాడ నుంచి కోటిపల్లి వరకు గతంలోనే రైల్వేట్రాకు నిర్మించారు. అక్కడ నుంచి కోనసీమలోకి రైలులైను ఏర్పాటుకు కోటిపల్లి-శానపల్లిలంక మధ్యలో గౌతమి గోదావరి నదీపాయపై వంతెన ఏర్పాటుకు రైల్వేశాఖ చర్యలు చేపట్టింది. సుమారు రూ. 344 కోట్ల వ్యయంతో ఈ పనులు జరుగుతున్నాయి. వంతెన నిడివి సుమారు 3.50 కిలోమీటర్లు. దక్షిణ మధ్య రైల్వే విభాగంలో ఇదే పొడవైన రైలు వంతెనగా నిలవనుంది.
వెల్ ఫౌండేషన్ విధానంలో...
ఈ వంతెన నిర్మాణం వెల్ ఫౌండేషన్ విధానంలో చేపడుతున్నారు. మొత్తం 45 వెల్స్ను భూమిలోకి దించి అక్కడి నుంచి వంతెన నిర్మాణం చేపడతారు. ఈ 45 వెల్స్కుగాను 44 కానాలు వస్తాయి. ఒక్కో కానా నిడివి సుమారు 80 మీటర్లు. సుమారు 60 మీటర్ల లోతున వెల్ను భూమిలోకి దించి అక్కడి నుంచి వంతెన నిర్మిస్తున్నారు. వంతెన నిర్మాణానికి సంబంధించి ప్రధానంగా ఎడమవైపు అబెక్ట్మెంట్ వెల్, ఒకటో నంబరు వెల్ కోటిపల్లి వైపున, కుడివైపు అబెక్ట్మెంట్ వెల్, 43వ నంబరు వెల్ శానపల్లిలంక వైపున వస్తాయి. మధ్యలో మిగిలిన వెల్స్ రూపుదిద్దుకుంటాయి. మొత్తం వంతెన నిర్మాణానికి సంబంధించి ప్రస్తుతం మూడు వెల్స్ నిర్మాణ పనుల్లో రైల్వేశాఖ నిమగ్నమై ఉంది. మొత్తం వంతెన నిర్మాణానికి సంబంధించి 3.50 కిలోమీటర్ల పొడవులో సుమారు కిలో మీటరున్నర నదిలో నీళ్లు ఉంటాయి. జులై నుంచి మొదలుకుని సెప్టెంబరు వరకు నదంతా వరదనీటితో నిండిపోతుంది. వరదలకు ముందుగానే వంతెన నిర్మాణంలో ప్రగతి తీసుకు రావాలనే దిశగా ఇక్కడ పనులు చేస్తున్నారు. అధికారులు, ఇతర ఉద్యోగులు, కార్మికులు మొత్తం సుమారు 250 మంది వరకు ఈ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. నిర్మాణ ప్రదేశంలో సిబ్బంది ఉండేందుకు వీలుగా నివాసాలు ఏర్పాటు చేశారు. కాంక్రీటు మిక్సర్ ప్లాంట్, వే బ్రిడ్జి వంటివి సిద్ధం చేశారు. రైలు వంతెన నిర్మాణ పనులు జరుగుతుండడంతో ఈ ప్రాంతంలో సందడి నెలకొంది.