రాష్ట్రానికి మరో కొత్త రైలు!
విశాఖపట్నం నుంచి బెంగళూరుకు
కసరత్తు చేస్తున్న రైల్వేశాఖ
తొలుత ప్రత్యేక రైలు..
ఆ తర్వాత రెగ్యులర్గా
ఈనాడు,...
more... అమరావతి: ఆంధ్రప్రదేశ్కు మరో కొత్త రైలు వచ్చే అవకాశాలున్నాయి. విశాఖపట్నం-బెంగళూరు మధ్య కొత్త రైలు పట్టాలు ఎక్కించేందుకు రైల్వేశాఖ కసరత్తు చేస్తోంది. నైరుతి రైల్వే ఆమోదం తెలపగా, తూర్పుతీర రైల్వే సానుకూల సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. కొత్త రైలుకు సంబంధించిన ప్రక్రియ పూర్తికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉండటంతో బెంగళూరు నుంచి విశాఖపట్నంకు ముందుగా ‘ప్రత్యేక’ రైలు నడిపించాలని నైరుతి రైల్వే నిర్ణయించింది. దసరా, దీపావళి పండగలకు ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని నాలుగైదు రోజుల్లో ప్రత్యేక రైలును పట్టాలు ఎక్కించాలని నిర్ణయం తీసుకుంది. నవంబరులో రెగ్యులర్గా కొత్త రైలు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
విశాఖపట్నం నుంచి బెంగళూరుకు రైలు ప్రయాణికుల నుంచి భారీ డిమాండ్ ఉంది. హౌరా, యశ్వంత్పూర్, ప్రశాంతి, పూరి.. నాలుగు రైళ్లు ఉన్నప్పటికీ ఒడిశా, పశ్చిమబెంగాల్ నుంచి ఈ రైళ్లు ప్రారంభం అవుతాయి. దీంతో విశాఖపట్నంలో ఎక్కేవారికి బెర్తుల కోటా తక్కువగా ఉంటోంది. ఫలితంగా విశాఖ నుంచి విమానాలకు డిమాండ్ పెరిగింది.
విశాఖపట్నం నుంచి బెంగళూరుకు కొత్తగా రైలు ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొంతకాలం క్రితమే రైల్వేశాఖ మంత్రి సురేష్ప్రభుని కోరారు. ఈ ప్రతిపాదనపై రైల్వేశాఖ కసరత్తు చేస్తోంది. విశాఖపట్నం నుంచి బెంగళూరు వెళ్లేందుకు రెండు రైల్వే మార్గాలు ఉన్నాయి. విజయవాడ, రేణిగుంట, కాట్పాడి మీదుగా ఒక మార్గం.. విజయవాడ, గుంటూరు, నంద్యాల, డోన్, అనంతపురం, ధర్మవరం మీదుగా మరోమార్గం ఉంది. రెండో మార్గంలో కొత్తరైలు నడిపితే రాయలసీమలో ఎక్కువ ప్రాంతాలకు ఉపయుక్తంగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం సూచించినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనలపై తూర్పుతీర, నైరుతి రైల్వేల చీఫ్ ప్యాసింజర్ ట్రాన్స్పోర్టేషన్ మేనేజర్ (సీపీటీఎం)లు చర్చిస్తున్నారు. నంద్యాల-ధర్మవరం మార్గంలో నడిపితే తమకు అభ్యంతరం లేదని నైరుతి రైల్వే స్పష్టం చేసినట్లు తెలిసింది. తూర్పుతీర రైల్వే తుది నిర్ణయం తీసుకుంటే వీలైనంత త్వరగా కొత్త రైలు పట్టాలు ఎక్కే అవకాశాలున్నాయి. విజయవాడ-ధర్మవరం మధ్య జులైలో ప్రవేశపెట్టిన ఎక్స్ప్రెస్ రైలును హిందూపూర్ వరకు పొడిగించే ప్రతిపాదనను రైల్వేశాఖ పరిశీలిస్తున్నట్లు సమాచారం.