రాజస్థాన్: డ్రైవర్ లేకుండానే రాజస్థాన్లోని ఓ రైలు 40 కిలోమీటర్ల దూరం వెళ్లిపోయింది. ఎలాంటి ప్రమాదమూ జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రాష్ట్రంలోని సెంద్రా రైల్వేస్టేషన్లో ఆగిన ఓ గూడ్సు రైలు... డ్రైవర్ లేకుండానే ఉన్నట్టుండి కదిలింది. వేగమూ అందుకుంది. దీన్ని గమనించిన అధికారులు తర్వాతి స్టేషన్లను అప్రమత్తం చేశారు. దారిలో ఉన్న రైల్వే గేట్లన్నింటిని మూసేశారు. రైలు పట్టాలపై రాళ్లు, బస్తాలు వేసి ఆపే ప్రయత్నం చేశారు. అవేవీ ఫలించలేదు. మొత్తానికి సోజాత్ స్టేషన్ దగ్గర రైలు దానంతట అదే ఆగిపోయింది. పెద్ద ప్రమాదం తప్పినందుకు రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.